5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : బీర్కూర్ పరిసర గ్రామాల విద్యార్థుల రవాణా సమస్యను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు,ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.శుక్రవారం బాన్సువాడ నుంచి తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వెళ్తున్న సమయంలో కిష్టాపూర్ గ్రామ బస్టాండ్ వద్ద సుమారు 20 మంది విద్యార్థులు బస్సు కోసం వేచి ఉండడాన్ని గమనించిన పోచారం శ్రీనివాసరెడ్డి వాహనాన్ని ఆపి వారి సమస్యలను తెలుసుకున్నారు.విద్యార్థులు మాట్లాడుతూ బస్సులు సమయానికి అందుబాటులో లేకపోవడంతో ముందుగా బాన్సువాడకు వెళ్లి అక్కడి నుంచి మరో బస్సులో ఎస్ఆర్ఆన్కె డిగ్రీ కళాశాలకు వెళ్లాల్సి వస్తోందని, దీంతో సమయానికి కళాశాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు.దీనిపై వెంటనే స్పందించిన పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ డిపో మేనేజర్ రవికుమార్తో ఫోన్లో మాట్లాడి, బాన్సువాడ–బీర్కూర్–కిష్టాపూర్–తిమ్మాపూర్–బొమ్మందేవ్పల్లి చౌరస్తా మీదుగా ఎస్ఆర్ఆన్కె డిగ్రీ కళాశాల వరకు ఉదయం ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అలాగే, విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులు సురక్షితంగా, సమయానికి కళాశాలకు చేరుకునేలా ఉదయం, సాయంత్రం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని సూచించారు.తమ సమస్యను వెంటనే గుర్తించి పరిష్కారం చూపిన పోచారం శ్రీనివాసరెడ్డికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Banswada News
విద్యార్థుల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పోచారం
Quick Summary:
విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సర్వీస్...పోచారం ఆదేశాలు
